Manchu Vishnu: శత్రువులపై విరుచుకు పడుతున్న 'కన్నప్ప'... టీజర్ రిలీజ్!

- 'కన్నప్ప'గా కనిపించనున్న మంచు విష్ణు
- భారీ తారాగణాన్ని కవర్ చేస్తూ టీజర్
- యుద్ధవీరుడిలా కనిపిస్తున్న కన్నప్ప
- ఏప్రిల్ 25వ తేదీన సినిమా రిలీజ్
మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందింది. సొంత బ్యానర్ పై ఆయన నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహా శివభక్తుడైన 'తిన్నడు' కథ ఇది. పరమశివుడికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధపడిన 'కన్నప్ప' కథ ఇది. అలాంటి ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు.
గిరిజన తెగలు... ఆ తెగలకు సంబంధించిన నాయకులు... వాళ్ల మధ్య పోరాటం... తిన్నడి పరాక్రమం... పరమశివుడి పట్ల తిన్నడికి గల నిరసన భావం... అంతటి నాస్తికుడు భక్తుడిగా ఎలా మారతాడు అంటూ సాక్షాత్తు పార్వతీదేవి... పరమశివుడి దగ్గర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. మంచు విష్ణు మొదలు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను వదిలారు.
అక్షయ్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, దేవరాజ్, ముఖేశ్ ఋషి, మోహన్ లాల్, కాజల్, మధుబాల ఇలా అందరూ ఈ టీజర్ లో కనిపించేలా చూసుకున్నారు. కృష్ణంరాజు 'భక్త కన్నప్ప' మూవీ ఆరంభంలో తిన్నడు నాస్తికుడిగా, కండబలం చూసుకుని మురిసిపోయేవాడిలా మాత్రమే కనిపిస్తాడు. కానీ 'కన్నప్ప'లో తిన్నడిని ఒక మహావీరుడిగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా టీజర్ ను బట్టి అర్థమవుతోంది.