కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం: వైఎస్ కోసం పదవి త్యాగం.. రేవంత్ సర్కారులో పదవికి ఎసరు

Konda Surekha political journey sacrificed post for YS and now facing threat in Revanth government
  • వైఎస్ మరణం తర్వాత జగన్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా
  • నిరంతరం పార్టీలు మారుతూ, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వైనం
  • సీఎం రేవంత్‌పై కుమార్తె వ్యాఖ్యల వివాదంతో మంత్రి పదవి కోల్పోయిన సురేఖ
  • వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో నిత్యం కొనసాగిన ఆధిపత్య పోరు
  • కుటుంబానికి పదవుల కోసం ఒత్తిడి వ్యూహం బెడిసికొట్టిందన్న విశ్లేషణలు
రాజకీయాల్లో విజయాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే నేతగా కొండా సురేఖ రాజకీయ ప్రయాణం సాగింది. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీ మార్పులు, సంచలన నిర్ణయాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె నిత్యం వార్తల్లోని వ్యక్తిగా మారారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, చివరికి ఆమె మంత్రి పదవి కోల్పోయే పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలో, 1995లో ఎంపీపీగా మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానంలోని ప్రధాన మలుపులు, వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

వైఎస్ విధేయురాలిగా.. జగన్ సైనికురాలిగా..
కొండా మురళి తొలుత పీపుల్స్ వార్ గ్రూపులో పనిచేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా, ముఖ్య అనుచరులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ విధేయతకు గుర్తింపుగా 2009లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొండా సురేఖకు మంత్రి పదవి లభించింది. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించినప్పుడు, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సురేఖ, జగన్‌కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే పదవిని కూడా త్యజించి ఉప ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె, జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా మహబూబాబాద్ (మానుకోట)లో తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను, నిరసనలను ఎదుర్కొన్నారు.

పార్టీలు మారినా వీడని వివాదాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొండా దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక, ఆ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసి బయటకు వచ్చారు. 2018 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా కుటుంబం నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచింది. మంత్రిగా ఉన్నప్పటికీ, సహచర ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతలతో ఆధిపత్య పోరు నడిపారు. ఈ గొడవలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. గతంలో సినీ నటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కోర్టు కేసుల వరకు దారితీశాయి. జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనూ ఆమెకు సఖ్యత లేదనే ప్రచారం జరిగింది.

ఒత్తిడి వ్యూహం బెడిసికొట్టిందా?
తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ, కుమార్తె సుస్మితకు పరకాల అసెంబ్లీ సీటు కోసం కొండా సురేఖ తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం, పార్టీకి నిరంతరం తలనొప్పిగా మారుతున్న కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవడానికి అధిష్ఠానానికి ఒక అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు సురేఖ ప్రయోగించిన బీసీ కార్డు కూడా ఆమె పదవిని కాపాడలేకపోయింది. మొత్తం మీద, ఒత్తిడి రాజకీయాలు, వివాదాస్పద వైఖరే ఆమె మంత్రి పదవిని దూరం చేశాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Advertisement
Konda Surekha
Revanth Reddy
Telangana Congress
YS Rajasekhar Reddy
Konda Murali
Telangana Politics

More Telugu News