ఫిట్‌నెస్ విషయంలో నో కాంప్రమైజ్.. ఆటగాళ్ల ఎంపికలో బీసీసీఐ కొత్త పాలసీ!

BCCI implements new strict fitness policy for player selection
  • ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కఠిన వైఖరి
  • 200 శాతం ఫిట్‌గా ఉంటేనే జట్టులోకి ఎంపిక చేయాలని నిర్ణయం
  • గాయాల నిర్వహణపై విమర్శల నేపథ్యంలో కొత్త పాలసీ
  • ఆఫ్ఘ‌న్ సిరీస్‌కు నలుగురు ఆటగాళ్లు ఫిట్‌నెస్‌కు లోబడి ఎంపిక
  • పూర్తి పారదర్శకత కోసమే ఈ విధానమన్న వీవీఎస్ లక్ష్మణ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల ఎంపిక విషయంలో, ముఖ్యంగా వారి ఫిట్‌నెస్‌కు సంబంధించి అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించడం ప్రారంభించింది. గాయపడిన ఆటగాళ్ల నిర్వహణపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్ఠ‌మైన చర్యలు చేపట్టింది. ఇకపై ఒక ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేయాలంటే, అతని ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు, ఏకంగా 200 శాతం నమ్మకం ఉంటేనే తుది నిర్ణయం తీసుకోవాలని పాలసీని మార్చింది.

ఇటీవల ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఈ కొత్త విధానం స్పష్టంగా కనిపించింది. ఈ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల పేర్ల పక్కన ఒక ఆస్టరిస్క్ (*) గుర్తును చేర్చారు. దీని అర్థం, వారి ఎంపిక వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా గాయాలతో సతమతమవుతున్న ఆటగాళ్లను పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం, వారు ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడి మళ్లీ గాయపడటంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బోర్డు ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. "ఒక ఆటగాడి లభ్యతపై 100 శాతం కాదు, 200 శాతం విశ్వాసం వచ్చాకే అతడిని విడుదల చేయాలని యాజమాన్యం భావిస్తోంది" అని ఈ విధానం గురించి తెలిసిన ఒక అధికారి పేర్కొన్నారు.

ఈ కొత్త విధానంపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. ఎంపిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించాడు. "జాతీయ సిరీస్‌లలో పాల్గొనడానికి తాము ఇంకా సిద్ధంగా లేమని ఆటగాళ్లు అర్థం చేసుకుంటారు. ఈ కమ్యూనికేషన్ ఆటగాళ్లకు, జట్టుకు మధ్య సజావుగా సాగుతోంది. ఫిట్‌నెస్ రిపోర్టులు, ఎంపిక ప్రక్రియలో బీసీసీఐ పారదర్శకతను పాటిస్తోంది. ఒకవేళ ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే, వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సెలక్టర్లకు స్పష్టత ఉంటుంది. ఇది చాలా ప్రాథమికమైన విషయం" అని లక్ష్మణ్ తెలిపాడు.

ఆటగాళ్ల పేర్ల పక్కన ఆస్టరిస్క్ గుర్తు ఎందుకు చేర్చారో బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కూడా వివరించారు. సాధారణంగా అంతర్జాతీయ సిరీస్‌లకు 3-4 వారాల ముందే జట్లను ఎంపిక చేస్తామని, ఎంపిక తేదీ నాటికి ఒక ఆటగాడు ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభమయ్యే నాటికి కోలుకునే అవకాశం ఉంటుందని అన్నారు. "ఆ సమయంలో అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, జట్టులోకి తీసుకుంటాం. అందుకే వారిని పూర్తిగా తిరస్కరించకుండా, ఫిట్‌నెస్‌కు లోబడి ఎంపిక చేస్తున్నాం" అని సైకియా పేర్కొన్నారు.

ఆఫ్ఘ‌నిస్థాన్ సిరీస్ విషయానికొస్తే, బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగే తొలి మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తారని అంచనా. అయితే, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, సీఓఈ ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త పాలసీతో ఆటగాళ్ల దీర్ఘకాలిక కెరీర్‌కు మేలు చేయడంతో పాటు జట్టు స్థిరత్వాన్ని కాపాడాలని బీసీసీఐ భావిస్తోంది.
Advertisement
BCCI
Indian Cricket Team Fitness Policy
Jasprit Bumrah Fitness Status
VVS Laxman COE Update
India Afghanistan T20 Selection
BCCI Player Selection Rules

More Telugu News