హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. ఎక్సైజ్ మాజీ కానిస్టేబుల్ అరెస్ట్

  • కొంపల్లిలో భారీగా అల్ఫ్రాజోలం డ్రగ్స్ పట్టివేత
  • సుమారు రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్స్ స్వాధీనం
  • ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రధాన నిందితుడు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేశ్
  • కామారెడ్డి నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తింపు
హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల అల్ఫ్రాజోలం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి జయభేరి పార్క్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలో నిఘా పెట్టి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి అల్ఫ్రాజోలంతో పాటు రూ.40,000 నగదు, ఒక కారు, ఒక బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాకు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ గొల్ల రమేశ్ సూత్రధారిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై గతంలోనే మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయి. కామారెడ్డి నుంచి డ్రగ్స్‌ను తీసుకువచ్చి కొంపల్లి, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

More Telugu News