యూపీఐకి 10 ఏళ్లు.. మోదీకి చంద్రబాబు అభినందనలు

Chandrababu Naidu congratulates PM Modi on 10 years of UPI
  • యూపీఐపై ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు
  • సామాన్యుడి దైనందిన లావాదేవీలను యూపీఐ మార్చేసిందన్న సీఎం
  • చిరు వ్యాపారులు, మహిళలకు చెల్లింపులు సులభతరం చేసిందని వెల్లడి
  • భారత టెక్నాలజీ సామర్థ్యానికి యూపీఐ నిదర్శనమని కితాబు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ ఒక అద్భుతమైన మైలురాయి అని, సామాన్యుడి జీవితంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.

ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన పోస్టుకు స్పందిస్తూ చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. “గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారూ, మీరు చెప్పింది అక్షర సత్యం. నా వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రజల ఆర్థిక లావాదేవీల స్వరూపాన్ని యూపీఐ సమూలంగా మార్చివేసింది. వీధి వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. దైనందిన లావాదేవీలను ఇది ఎంతో సులభతరం చేసింది. ప్రపంచానికి భారత సాంకేతిక సత్తాను చాటిచెప్పిన ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రతి భారతీయుడికి అభినందనలు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

అంతకుముందు, యూపీఐ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. “భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ఒక కీలక మలుపు. దీని విస్తృతి, స్థాయి ప్రతి భారతీయుడికి గర్వకారణం” అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Narendra Modi
UPI 10 Years
Digital Payments India
Unified Payments Interface
Andhra Pradesh News

More Telugu News