చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త రైలు.. టైమింగ్స్ ఇవే!

New train from Charlapalli to Gorakhpur timings details
  • చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 2న ప్రారంభం కానున్న సర్వీసులు
  • పూర్తిగా నాన్-ఏసీ, స్లీపర్ కోచ్‌లతో ప్రయాణం
  • తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ మీదుగా రాకపోకలు
  • హైదరాబాద్ నుంచి ఇది ఆరవ అమృత్ భారత్ సర్వీస్
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. చర్లపల్లి టెర్మినల్ నుంచి గోరఖ్‌పూర్ జంక్షన్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (22075/22076) రైలును ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నాన్-ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు సర్వీసులు 2026 అక్టోబర్ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ రైలు (22075) చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్‌కు తన రెగ్యులర్ సర్వీసును అక్టోబర్ 2వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభించనుంది. ప్రయాణానికి సుమారు 32 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. తిరుగు ప్రయాణంలో గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లికి (22076) సర్వీసు అక్టోబర్ 4వ తేదీ (ఆదివారం) నుంచి మొదలవుతుంది. ఈ రైలు వారానికి ఒకసారి రెండు దిశల్లోనూ రాకపోకలు సాగిస్తుంది. 

ఆధునిక సదుపాయాలతో ప్రయాణం
ఈ అమృత్ భారత్ రైలులో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. వేగవంతమైన ప్రయాణం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించారు. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో కేవలం జనరల్ అన్ రిజర్వ్‌డ్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి ఆధునిక నాన్-ఏసీ బోగీలు కాగా, ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్లు, సీల్డ్ గ్యాంగ్‌వేలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ప్రారంభమవుతున్న ఆరవ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణకు సేవలందిస్తున్న ఏడవ సర్వీస్ ఇది కావడం విశేషం.

మార్గం, సమయాలు
ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. తెలంగాణలోని కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లలో ఆగుతుంది. అక్కడి నుంచి బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, లక్నో మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.

రైలు నెం. 22075 చర్లపల్లిలో ప్రతి శుక్రవారం రాత్రి 9:45 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 6:25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 22076 ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకు గోరఖ్‌పూర్‌లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 5:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ కొత్త సర్వీసుతో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే వలస కార్మికులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
Advertisement
Charlapalli Gorakhpur Amrit Bharat Express
South Central Railway
Hyderabad to Gorakhpur New Train
Amrit Bharat Express Timings
Indian Railways
Charlapalli Railway Terminal

More Telugu News