దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
- అన్ని రాష్ట్రాలలో ఎల్పీజీ స్టాక్ ఉందన్న కేంద్ర ప్రభుత్వం
- గృహ వినియోగదారుల కోసం 100 శాతం స్టాక్ ఉందన్న కేంద్రం
- హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలు క్షేమంగా ఉన్నాయని వెల్లడి
- ఎల్పీజీ క్యారియర్ నౌక శివాలిక్ సాయంత్రం భారత్ చేరుకుంటుందని వెల్లడి
పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హర్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు సాయంత్రం 5 గంటలకు ఈ క్యారియర్ భారత్ చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.