విమానంలో పాడైన టాయిలెట్.. ప్రయాణికులకు బాటిల్స్ ఇచ్చిన సిబ్బంది
- వర్జిన్ ఆస్ట్రేలియా విమాన ప్రయాణికులకు చుక్కలు
- ఆరు గంటల ప్రయాణంలో చివరి 3 గంటలు నరకంలా మారిందని ఆవేదన
- క్షమాపణలు చెప్పిన విమానయాన సంస్థ
వివరాల్లోకి వెళితే.. గత గురువారం బాలిలోని డెన్ పసర్ విమానాశ్రయం నుంచి వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమానం బ్రిస్బేన్ బయలుదేరింది. ఆరు గంటల ఈ ప్రయాణంలో తొలి మూడు గంటలు సాధారణంగానే గడిచిపోగా.. చివరి మూడు గంటలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. మార్గమధ్యలో విమానంలోని టాయిలెట్లు పాడైపోవడంతో వాటిని ఉపయోగించే వీలులేక ప్రయాణికులు అవస్థపడ్డారు.
దీంతో ఎయిర్ హోస్టెస్ లు ప్రయాణికులకు ఖాళీ వాటర్ బాటిల్స్ ఇచ్చి అందులో పనికానిచ్చేయాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో కొంతమంది వాటిని ఉపయోగించుకున్నారు. ఒకరిద్దరు వృద్ధులు బట్టల్లోనే మూత్రం పోసుకోవడంతో విమానంలో దుర్గంధం వ్యాపించింది. ఈ ఘటనపై వర్జిన్ ఆస్ట్రేలియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.