విజయవాడ జైల్లో ఒకే బ్యారక్లో వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్ఆర్!
- విజయవాడ జిల్లా జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
- మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి, నటి కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా అక్కడే
- ముగ్గురినీ ఒకే బ్యారక్లోని వేర్వేరు సెల్స్లో ఉంచిన అధికారులు
- వంశీ, రాజ్, పీఎస్ఆర్ ఉంటున్న సెల్స్లో సీసీ కెమెరాల ఏర్పాటు
టీడీపీ కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్నారు. తాజాగా, మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు వచ్చారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో అధికారులు వారిని విజయవాడ జిల్లా కారాగారానికి తరలించారు.
విజయవాడ జిల్లా జైలులో మొత్తం మూడు బ్యారక్లు ఉన్నాయి. వీటిలో ఒకటో నంబర్ బ్యారక్లో 11 గదులు ఉన్నాయి. ప్రముఖులు, ప్రత్యేక కేసుల్లోని వారిని సాధారణంగా రెండు, మూడు నంబర్ బ్లాక్లలో ఉంచుతారు. అయితే, వల్లభనేని వంశీని ఒకటో నంబర్ బ్యారక్లోని ఒక సెల్లో ఉంచారు. తాజాగా జైలుకు వచ్చిన రాజ్ కసిరెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా ఇదే బ్యారక్లోని వేర్వేరు సెల్స్కు కేటాయించినట్లు తెలిసింది.
ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్టయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.