ఏపీలో ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
- రాజధాని గ్రామాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంపు ఉండదన్న మంత్రి అనగాని
- భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవన్న మంత్రి
- త్వరలో తల్లికి వందనంతో పాటు మిగిలిన హామీలు అమలు చేస్తామని వెల్లడి
సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి, మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్ధతుల్లో వశం చేసుకున్న వారందరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22ఏ భూములు, 596 జీవోలతో పాటు మరో నాలుగు అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.