విజయవాడలో డీఎస్పీ సత్యానందం ఇంట్లో భారీ పేలుళ్లు
- విజయవాడ పటమటలంకలో డీఎస్పీ ఇంట్లో ప్రమాదం
- ఏసీ కంప్రెషర్ పేలడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయిన వైనం
- డీఎస్పీ కుటుంబం విదేశాల్లో ఉండటంతో తప్పిన ప్రాణనష్టం
- పేలుడు శిథిలాలు తగిలి బయట ఉన్న వ్యక్తి మృతి
వివరాల్లోకి వెళితే.. డీఎస్పీ సత్యానందం తన కుటుంబంతో కలిసి ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో వారి ఫ్లాట్ మూసి ఉంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మధ్యాహ్నం ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్ నుంచి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం పేలిపోయింది. ఈ వరుస పేలుళ్లతో అపార్ట్మెంట్లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనలో పేలుడు శిథిలాల నుంచి ఓ రాయి బయట ఉన్న ఒక వ్యక్తికి బలంగా తగలడంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే అతడు మృతిచెందాడు. పెద్ద శబ్దాలు విని భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏసీ కంప్రెషర్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.