వెలుగుమట్ల బాధితులకు 'ఇందిరమ్మ' భరోసా.. డిసెంబర్ 9న గృహప్రవేశాలు!
- 412 మంది బాధితులకు ఇళ్ల మంజూరు పత్రాలు
- డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- మిగిలిన 16 ఎకరాల్లో పబ్లిక్ స్కూల్, గురుకులాలు
- పేదల సొమ్ము వసూలు చేసే ముఠాలపై ఉక్కుపాదం
- సకల వసతులతో వెలుగుమట్లలో కొత్త లేఅవుట్
- పేదోడి ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యమన్న భట్టి విక్రమార్క
సకల వసతులతో 'మోడల్ కాలనీ'
వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారిలో తొలి విడతగా 412 మందిని అర్హులుగా గుర్తించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని 311 మందికి వెలుగుమట్లలోనే ఇళ్లు కేటాయించారు. మిగిలిన 101 మందికి వారి వారి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఈ కాలనీని అన్ని మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్లతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రులు ప్రకటించారు. నేటి నుంచే నిర్మాణ పనులు ప్రారంభించి, డిసెంబర్ 9న (సోనియా గాంధీ పుట్టినరోజు) సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశాలు చేయిస్తామని వెల్లడించారు.
దళారుల ముఠాపై ఉక్కుపాదం
పేదల సంఘాల ముసుగులో భూములు ఆక్రమించి, పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారులను వదిలిపెట్టేది లేదని మంత్రులు హెచ్చరించారు. ఆ ముఠాల నుంచి పేదల డబ్బును తిరిగి ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు.
విద్యా రంగానికి పెద్దపీట
వెలుగుమట్లలో ఇళ్ల కేటాయింపు తర్వాత మిగిలిన 16 ఎకరాల భూమిని ఇతరులకు ఇవ్వకుండా.. అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్, గురుకుల పాఠశాలలను నిర్మిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.