యూత్ వన్డేల్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు నమోదు
- యూఏఈపై 433/6 పరుగుల రికార్డు స్కోరు చేసిన భారత యువ జట్టు
- యూత్ వన్డేల్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు
- 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 171 పరుగులతో విధ్వంసం
- యూత్ వన్డేల్లో మూడుసార్లు 400పైగా స్కోర్లు చేసిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు
ఈ మ్యాచ్లో 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. అతనికి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆరోన్ జార్జ్ (69), విహాన్ మల్హోత్రా (69) చక్కటి సహకారం అందించడంతో పరుగుల వరద పారింది.
అరుదైన ప్రపంచ రికార్డు
ఈ స్కోరుతో భారత యువ జట్టు ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూత్ వన్డేల చరిత్రలో మూడుసార్లు 400కు పైగా స్కోర్లు చేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు 2004లో స్కాట్లాండ్పై 425/3, 2022లో ఉగాండాపై 405/5 పరుగులు చేసింది. యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు మాత్రం ఆస్ట్రేలియా (480/6, కెన్యాపై 2002లో) పేరిట ఉంది.