షారుక్, దీపికా పదుకొణేలకు ముందస్తు బెయిల్ మంజూరు
- కారు యాడ్ వివాదంలో షారుఖ్, దీపికాకు ఊరట
- రాజస్థాన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
- తయారీ లోపాలకు అంబాసిడర్లు బాధ్యులు కారన్న న్యాయవాదులు
రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన కీర్తి సింగ్ అనే మహిళా న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాను హ్యూందాయ్ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేశానని, కేవలం షారుఖ్, దీపికా దానిని ప్రమోట్ చేస్తున్నారన్న నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కారులో అనేక లోపాలు బయటపడ్డాయని, వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ వారిద్దరితో పాటు మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఆమె ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా షారుఖ్ ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కారు తయారీ ప్రమాణాలతో గానీ, దానిలోని లోపాలతో గానీ తన క్లయింట్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. కేవలం బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్నంత మాత్రాన ఉత్పత్తి నాణ్యతకు బాధ్యత వహించలేరని ఆయన స్పష్టం చేశారు. దీపికా పదుకొణె తరఫు న్యాయవాది మాధవ్ మిత్రా కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు. కారు ఉత్పత్తిలో గానీ, నాణ్యత నియంత్రణలో గానీ తన క్లయింట్ పాత్ర ఏమీ లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. షారుఖ్, దీపికాతో పాటు మిగిలిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.