Raj Tarun: ముగిసిన వివాదం.. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి అనుమతించిన లావణ్య

- లావణ్య ఇంటికి మొన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు
- కేసు కోర్టులో ఉందని లోపలికి అనుమతించని లావణ్య
- పోలీసుల జోక్యంతో పట్టు వీడిన లావణ్య
సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్న లావణ్య.. ఎట్టకేలకు వారిని అనుమతించింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్టు అయింది. హైదరాబాద్ సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి దంపతులు బుధవారం కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకున్నారు. కేసు కోర్టులో ఉండటంతో ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పారు. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటి ఎదుట బైఠాయించారు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు జోక్యం చేసుకొని వారిని ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు సూచించారు. పోలీసుల సూచనతో లావణ్య వారిని ఇంట్లోకి అనుమతించారు. ఈ సందర్భంగా బస్వరాజ్, రాజేశ్వరి మాట్లాడుతూ లావణ్య తమ కోడలు కాదని, తమ కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఆమెతో సహజీవనం మాత్రమే చేశాడని, కాబట్టి ఆమెను కోడలిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు.