Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు

- జోరుగా ‘కన్నప్ప’ ప్రమోషన్స్
- ప్రమోషన్స్లో భాగంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న కన్నప్ప టీం
- మామూలుగా తాను ఆంజనేయ స్వామి భక్తుడ్ని అన్న విష్ణు
- కానీ కన్నప్పతో ప్రయాణం తర్వాత శివ భక్తుడిగా మారిపోయానని వెల్లడి
- ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ‘కన్నప్ప’ రిలీజ్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీం పాల్గొంది.
ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ... "నేను మామూలుగా ఆంజనేయ స్వామి భక్తుడ్ని. కానీ కన్నప్పతో ప్రయాణం ప్రారంభం అవ్వడంతో శివ భక్తుడిగా మారిపోయాను. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రభాస్ పాత్రను ఎంత ఊహించుకున్నా... అంతకు మించి అనేలా ఉంటుంది. కన్నప్ప ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది" అని అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ... "కన్నప్ప లాంటి గొప్ప చిత్రంలో ఓ మంచి పాత్రను వేయడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతకు ధన్యవాదాలు. మా అందరి కెరీర్ కన్నప్పకి ముందు... కన్నప్పకి తరువాత అన్నట్టుగా మారుతుంది. నా బర్త్ డే సందర్భంగా కన్నప్పను రిలీజ్ చేస్తున్నారు. విష్ణు నటన చూసి అంతా ఫిదా అవుతారు. మైండ్ బ్లోయింగ్ అనేలా సినిమా ఉంటుంది" అని అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ... "కన్నప్ప’లాంటి చిత్రంలో నటించే అవకాశం రావడమే అదృష్టం. కన్నప్ప సినిమా అద్భుతంగా వచ్చింది. విష్ణు బాబు ఈ చిత్రంతో మరో స్థాయికి వెళతారు. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న రాబోతోంది. అందరినీ మెప్పించేలా ఈ మూవీ ఉంటుంది" అని అన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... "2015లోనే విష్ణు ఈ కన్నప్ప కథను అనుకున్నారు. 2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుడ్ని దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ఈ ప్రాజెక్ట్లోకి పంపించాడు. అదే శివ లీల. మహా భారతం సీరియల్ను అందరూ ప్రేమించారు. కన్నప్పని కూడా అదే స్థాయిలో అందరూ ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్ వంటి మహామహులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.