Lord Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇక 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

- భక్తుల సౌకర్యార్థం కొత్త డిజైన్ రూపొందించిన అధికారులు
- 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జి కూల్చివేత
- ఇకపై 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతి
- స్వామిని నిమిషంపాటు దర్శించుకునే వెసులుబాటు
శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు నూతన డిజైన్ రూపొందించారు. ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు. ఇప్పటి వరకు పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడీ వంతెనను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు.
మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజ స్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్పుర (కణిక్కవంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు.
ప్రస్తుతం ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండుమూడు సెకన్లపాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు.
తాజా డిజైన్తో కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.