రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరిని ఎంచుకోమంటే.. తెలివిగా తప్పించుకున్న ప్రియాంకా చోప్రా!
- చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరిని ఎంచుకుని చిక్కుల్లో పడాలని అనుకోవడం లేదన్న ప్రియాంక
- ఇద్దరూ భారతదేశంలో అత్యంత అభిమాన నటులని వ్యాఖ్య
- చరణ్.. ఇండియన్ బ్రాడ్ పిట్ అని ప్రశంస
- ఆర్ఆర్ఆర్ సినిమాను తాను ఇప్పటికీ చూడలేదని వెల్లడి
‘‘రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి?’’ అని యాంకర్ అడిగారు. ప్రియాంక బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అనొచ్చు. రామ్కు అంతలా చరిష్మా ఉంది. నాకు బ్రాడ్ పిట్ తెలియదు.. ఆయన మంచివారో కాదో కూడా తెలియదు. కానీ రామ్ మంచి వ్యక్తి’’ అని చెప్పుకొచ్చింది.
బ్రాడ్ పిట్, చరణ్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఆమె నిరాకరించింది. తాను బ్రాడ్ పిట్పై ప్రేమతో పెరిగానని, కాబట్టి ఆ ప్రశ్న అడగడం అన్యాయమని వ్యాఖ్యానించింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఒకరిని ఎంచుకోమని అడగ్గా.. సున్నితంగా తిరస్కరించింది. ‘‘ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్.. భారతదేశంలో అత్యంత అభిమాన నటులు. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంచుకుని నేను చిక్కుల్లో పడాలని అనుకోవడం లేదు. నేను తరచుగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. సో.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’’ అని తెలిపింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను తాను చూడలేదని ప్రియాంక చెప్పింది. తనకు సమయం ఉండటం లేదని, చాలా సినిమాలు చూడలేకపోయానని వెల్లడించింది. అయితే కొన్ని టీవీ షోలను చూశానని చెప్పింది. కానీ ఆస్కార్ అవార్డుల సందర్భంగా నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రచారంలో ప్రియాంక కూడా పాలుపంచుకోవడం గమనార్హం. అప్పట్లో చరణ్, ఉపాసన దంపతులకు అమెరికాలో ఆతిథ్యం కూడా ఇచ్చింది.