‘జనగణమన’ చిత్రం అటకెక్కేసినట్టేనా?.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యల అర్థమిదేనా?
- సైమా వేడుకలకు విజయ్ దేవరకొండ
- ‘జనగణమన’ చిత్రంపై ప్రశ్నకు సమాధానం దాటవేత
- ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్ కూడా ప్రారంభం
- ‘లైగర్’ ఫలితంతో దీనిని విరమించుకున్నట్టు వార్తలు
సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు ‘జనగణమన’ చిత్రం ఏమైందని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. సైమా వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని భావిస్తారని, కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోవాలని సమాధానమిచ్చారు. విజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సినిమా ఇక లేదన్న చర్చ మొదలైంది. ‘జనగణమన’ లైవ్లోనే ఉండి ఉంటే విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని చెబుతున్నారు.
‘జనగణమన’ పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు. ఆరేళ్ల క్రితమే పూరి దీని గురించి ప్రకటించారు. తొలుత మహేశ్బాబును సంప్రదించగా వివిధ కారణాలతో ఆయన దీని నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ఏడాది మార్చిలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్ఢే జంటగా ‘జనగణమన’ షెడ్యూల్ను ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో పూరి ‘జనగణమన’ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.