Andhra Pradesh: డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని తేల్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్

Forensic Report Says Subrahmanyam Murdered

  • కొట్టడంతో శరీరంలోని అంతర్గత అవయవాలకు గాయాలు
  • అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్
  • కాకినాడ ఏజెన్సీలో ఉన్నట్టు ఆచూకీ
  • ఐదు పోలీసు బృందాలతో గాలింపు
  • సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశం
  • బెయిల్ కోసం వైసీపీ నేతలతో ఎమ్మెల్సీ చర్చలు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. అతడిని తీవ్రంగా కొట్టడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, దీంతో అతడు చనిపోయాడని నివేదిక తేల్చింది. దీంతో ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు మరింత బిగిసినట్టయింది. 

హత్య అని తేలడం, భారీగా నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలతో చర్చిస్తున్నారు. ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాల నిరసనలతో పోలీసులు అనంత ఉదయ్ భాస్కర్ ను ఏ1 నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే, కాకినాడ ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉన్నట్టు ఆచూకీ తెలిసింది. దీంతో ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. సాయంత్రంలోగా అనంత్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ గన్ మెన్ ఎక్కడ ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. 

కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అతడి స్వగ్రామం జి.మామిడాడలో పూర్తయ్యాయి. ఇక, సుబ్రహ్మణ్యం మృతిపై హత్యకేసునే నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను టార్చర్ పెట్టలేదని స్పష్టం చేశారు. మహిళా పోలీసులతో కొట్టించారన్న సుబ్రహ్మణ్యం భార్య మాటల్లో వాస్తవం లేదన్నారు. కొట్టాల్సిన అవసరం పోలీసులకు ఏముందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News