Maniratnam: మణిరత్నం సినిమాకు పోటీగా వెబ్ సీరీస్!

  • 'పొన్నియన్ సెల్వన్'ను తెరకెక్కిస్తున్న మణిరత్నం 
  • ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ముఖ్య పాత్రధారులు 
  • తాజాగా అదే నవల వెబ్ సీరీస్ గా నిర్మాణం 
  • ఇళయరాజా సంగీతం.. ఆగస్టు నుంచి షూటింగ్    
Ponnian Selvan planned as Web series

మామూలుగా సినిమాల నుంచే సినిమాలకు పోటీ వస్తుంటుంది. అయితే, ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు మాత్రం ఇప్పుడు వెబ్ సీరీస్ నుంచి పోటీ ఎదురైంది. అదేమిటంటే, తమిళంలో ఎంతో ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మక నవల 'పొన్నియన్ సెల్వన్'ను వెండితెరకు ఎక్కించాలన్నది మణిరత్నం చిరకాల కోరిక. ఆ కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఆయన కొన్నాళ్ల క్రితం ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు, విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రకాశ్ రాజ్ వంటి తారాగణంతో ఆయన చిత్ర నిర్మాణాన్ని నిర్వహిస్తునన్నారు. ఇటీవలి కరోనా, లాక్ డౌన్ పర్యవసానంగా ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. ఇదే సమయంలో అజయ్ ప్రతాప్ అనే దర్శకుడు 'పొన్నియన్ సెల్వన్' నవలను తాను వెబ్ సీరీస్ గా చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు.    

ఇక దీనికి 'చిరంజీవి పొన్నియన్ సెల్వన్' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దీనికి సంగీతాన్ని సమకూరుస్తారు. ఆగస్టు 18 నుంచి ఈ వెబ్ సీరీస్ షూటింగును నిర్వహిస్తామని దర్శకుడు అజయ్ తెలిపారు. మైసూర్, కేరళ, హైదరాబాద్, శ్రీలంక ప్రాంతాలలో షూటింగ్ చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తొలి ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.  

More Telugu News