కాంగ్రెస్ రైతు దీక్ష సందర్భంగా జానారెడ్డి, వీహెచ్ మధ్య ఆసక్తికర సంభాషణ
- రైతులకు సంఘీభావంగా హైదరాబాదులో కాంగ్రెస్ దీక్ష
- జానారెడ్డి విరాళం ఇవ్వాలన్న వీహెచ్
- జేబులో ఎంతుంటే అంత ఇస్తానన్న జానా
- పది వేలు ఇచ్చిన వైనం
- ఇంకో లక్ష ఇవ్వాలన్న వీహెచ్
అయితే, జానా ప్రసంగం ముగించిన తర్వాత వేదికపై ఉన్న వీహెచ్ మైక్ అందుకుని, మిత్రుడు జానారెడ్డికి ముందేం జరిగిందో తెలియదు అంటూ మొదలుపెట్టారు. పేదవాళ్లు కూడా ఢిల్లీలోని రైతులకు విరాళాలు ఇస్తున్నారని, జానారెడ్డి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో జానారెడ్డి తన జేబులో ఎంత ఉంటే అంత ఇస్తానని, అవసరమైతే తర్వాత కూడా ఇస్తానని చెప్పారు. చెప్పడమే కాదు, జేబులోంచి కరెన్సీ నోట్లు తీసి వీహెచ్ కు ఇచ్చారు.
వీహెచ్ ఆ నోట్లను లెక్కిస్తుండగా, అదేమన్నా బాకీ డబ్బా, లేకపోతే మళ్లీ ఇచ్చేదా... లెక్కబెట్టడం ఎందుకు అని జానారెడ్డి అన్నారు. ఆపై నోట్ల లెక్కింపు పూర్తిచేసిన వీహెచ్... జానారెడ్డి కచ్చితంగా 10 వేలు తెచ్చాడు, ఇంకో లక్ష ఇస్తే అందరం సంతోషిస్తాం అని పేర్కొన్నారు. ఆపై జానాకు ధన్యవాదాలు చెబుతూ ఈ పదివేలనే పది కోట్లు అనుకుంటామని, నాగార్జునసాగర్ లో జానారెడ్డి తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. దాంతో జానారెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ గెలవాలని చెప్పండి అనగా, వీహెచ్ స్పందిస్తూ, నువ్వేమైనా వేరే పార్టీ వాడివా అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ గెలవాలని కోరుకుందాం అని తెలిపారు.