ఫుడ్ ప్యాకెట్లపై ఇక రెడ్ వార్నింగ్.. సుప్రీంకోర్టుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన

Red warning on food packets FSSAI key proposal to Supreme Court
  • ఆహార ప్యాకెట్లపై రెడ్ వార్నింగ్ లేబుల్స్ ప్రతిపాదన
  • ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటే ఈ హెచ్చరిక
  • సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలు సమర్పించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • వ్యాపారం కన్నా ప్రజారోగ్యమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు
  • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలు పెద్ద కంపెనీలు
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలపై త్వరలోనే ఎరుపు రంగు హెచ్చరిక గుర్తులు (లేబుల్స్) కనిపించనున్నాయి. ఉప్పు, చక్కెర లేదా కొవ్వు పదార్థాలు పరిమితికి మించి ఉన్న ఉత్పత్తుల ప్యాకెట్ల ముందరి భాగంలో ఈ హెచ్చరికలను ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదించింది. వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

ఈ ప్రతిపాదన ప్రకారం.. ప్యాకెట్లపై ‘హై ఫ్యాట్’, ‘హై షుగర్’, ‘హై సాల్ట్’ లేదా ‘హైలీ స్వీటెన్డ్ బేవరేజ్’ వంటి హెచ్చరికలు స్పష్టంగా కనిపించేలా ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.

ఈ అంశంలో జరుగుతున్న జాప్యంపై జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజల, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం తమ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నెస్లే, పెప్సికో, కోకా-కోలా వంటి దిగ్గజ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

రెండు వారాల్లోగా ఈ విషయంలో స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫైలింగ్‌లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ వివరాలను వెల్లడించింది.                                
Advertisement
FSSAI
Red Warning Labels
Packaged Food
Supreme Court of India
Food Safety Regulations
High Salt Sugar Fat

More Telugu News