యువత ఓటేస్తే.. జ్యోతిషుడిని నమ్ముతారా?: విజయ్పై ప్రేమలత ఫైర్
- తమిళనాడు సీఎం ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై దుమారం
- సీఎం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డీఎండీకే
- యువత ఓటేస్తే.. జ్యోతిషుడిని నమ్ముతారా? అంటూ నిలదీత
- విశ్వాస పరీక్ష వేళ రాజకీయంగా కీలక పరిణామం
- జ్యోతిష్యుడి నియామకాన్ని సమర్థించిన బీజేపీ
యువతకు మీరు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు?: ప్రేమలత
ఈ నియామకాన్ని డీఎండీకే తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే, విజయకాంత్ అర్ధాంగి ప్రేమలత అసెంబ్లీలో మాట్లాడుతూ... "ఒక జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమించడాన్ని నేను ఖండిస్తున్నాను. దీని ద్వారా యువతకు మీరు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? ఆయన మీ వ్యక్తిగత జ్యోతిష్యుడు అయితే, ఆ బంధాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోండి, ప్రభుత్వంలోకి తీసుకురావద్దు" అని ఘాటుగా విమర్శించారు. ఎన్నికలకు ముందు విజయ్ "సునామీ విజయం" సాధిస్తారని వెట్రివేల్ జోస్యం చెప్పారని, ఆయన సూచన మేరకే విజయ్ తన ప్రమాణ స్వీకార సమయాన్ని కూడా మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి.
నటుడు సీఎం అయినప్పుడు.. జ్యోతిష్యుడు ఓఎస్డీ ఎందుకు కాలేరు?: బీజేపీ
మరోవైపు ఈ నియామకంలో ఎలాంటి తప్పు లేదని బీజేపీ సమర్థించింది. బీజేపీ నేత వినోజ్ సెల్వం మాట్లాడుతూ, "అది ముఖ్యమంత్రి వ్యక్తిగత ఎంపిక. ఆయన సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని సీఎం భావిస్తే, అందులో తప్పేమీ లేదు. ఒక నటుడు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు, ఒక జ్యోతిష్యుడు ఓఎస్డీ ఎందుకు కాలేరు? ఇది సరైన అవకాశమే" అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, సీపీఎం, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. పీఎంకే పార్టీ (4 ఎమ్మెల్యేలు) ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ కూడా తటస్థంగా ఉంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం విజయ్కు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం సులభంగానే విశ్వాస పరీక్షలో గట్టెక్కనుంది.