మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని
- పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని మోదీ
- కొత్తవి కొనకుండా ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలని ఎస్పీజీకి సూచన
- మోదీ బాటలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపు
- ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశభక్తిగా విదేశీ మారకాన్ని ఆదా చేయాలన్న ప్రధాని
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తితో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వంటి వారు కూడా తమ అధికారిక కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇది దేశవ్యాప్తంగా పరిపాలనలో పొదుపును ప్రోత్సహించే విస్తృత ప్రయత్నాలలో భాగంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతూనే, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. "ప్రతిదానికీ దిగుమతులపై ఆధారపడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?" అని ప్రశ్నిస్తూ, స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు.
అంతేగాక ప్రజలు తమ జీవనశైలిలో బాధ్యతాయుతమైన మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కూడా దేశభక్తితో సమానమని చెబుతూ, ప్రజలు ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు వంటివి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, వేడుకలను దేశంలోనే జరుపుకోవాలని ఆయన కోరారు.