తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం
- తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం
- సిద్దిపేటలో విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్
- జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమణయ్య
- ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ అధినేత
తాను సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో రమణయ్య గారు హిస్టరీ లెక్చరర్గా ఉండేవారని, ఆయన వద్ద విద్యను అభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. రమణయ్య గారు తనకు అత్యంత ఆత్మీయుడని పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు.
జగిత్యాలకు చెందిన డాక్టర్ జైశెట్టి రమణయ్య, చరిత్రకారుడిగా మంచి పేరు సంపాదించారు. 1971లో సిద్దిపేటలోని జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేశారు. చిన్న వయసులోనే అధ్యాపక వృత్తిలోకి అడుగుపెట్టిన ఆయన, జగిత్యాలలో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే అంశంపై పరిశోధన చేసి ఆయన పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
రమణయ్య గారి మరణ వార్తతో శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
