శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
- తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
- చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
- ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
- ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల ముసుగులో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను రహస్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే, అమెరికా చర్చలు జరుపుతున్నప్పటికీ తాము మాత్రం స్వతంత్రంగా సైనిక చర్యలు కొనసాగిస్తామని ప్రకటించింది.
ఇజ్రాయెల్ తాజా నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న కఠిన వైఖరి, అమెరికా దౌత్యపరమైన వైఖరికి మధ్య విభేదాలు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే ఇరాన్ కూడా శాంతి చర్చల నుంచి వైదొలిగే ప్రమాదం లేకపోలేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సిరియా, లెబనాన్లోని ఇరాన్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం కావచ్చని అంచనా వేస్తున్నారు.