భారతీయుల్లో డయాబెటిస్ టెస్టులపై 'లాన్సెట్' కీలక హెచ్చరిక
- డయాబెటిస్ నిర్ధారణకు హెచ్బీఏ1సీ టెస్టుపైనే ఆధారపడొద్దు
- రక్తహీనత వంటి సమస్యల వల్ల రీడింగ్స్ తప్పుగా వచ్చే అవకాశం
- ప్రఖ్యాత 'లాన్సెట్' జర్నల్లో భారత నిపుణుల అధ్యయనం
- ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ వంటి ఇతర పరీక్షలు అవసరమని సూచన
ఢిల్లీలోని ఫోర్టిస్-సీడీఓసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛైర్మన్, ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారతీయులలో ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత, థలసేమియా, జీ6పీడీ లోపం వంటి హిమోగ్లోబిన్కు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు హెచ్బీఏ1సీ రీడింగులను ప్రభావితం చేస్తాయని, ఫలితంగా కొందరిలో షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించకపోవడం లేదా లేకపోయినా ఉన్నట్టు తప్పుడు నిర్ధారణకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో వివరించారు.
"కేవలం హెచ్బీఏ1సీపై ఆధారపడితే వ్యాధి నిర్ధారణ, పర్యవేక్షణలో పొరపాట్లు జరగవచ్చు. దీనివల్ల కొందరిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉంది" అని ప్రొఫెసర్ అనూప్ మిశ్రా తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు, హెచ్బీఏ1సీతో పాటు ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (OGTT), సెల్ఫ్-మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ (SMBG), కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) వంటి బహుళ పరీక్షల విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఈ సమగ్ర విధానం ఎంతో అవసరమని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.