తీరు మార్చుకోని జగన్కు ఆ హోదా కష్టమే: రఘురామకృష్ణరాజు
- జగన్ తీరు మారనంత కాలం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కడం కష్టమన్న రఘురామ
- 11 కేసులున్న జగన్ ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగారని నిలదీత
- అక్రమంగా సంపాదించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన ఉప సభాపతి
2020 నుంచి తనపై జగన్ బురదజల్లుతూనే ఉన్నారని, తనను చంపాలని చూసినా భయపడకుండా ఒంటరి పోరాటం చేశానని రఘురామ గుర్తుచేశారు. తనపై మూడు కేసులున్నాయనే సాకుతో ఉపసభాపతి హోదా నుంచి తొలగించాలని కోరడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. "11 కేసులున్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు?" అని జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. విద్యుత్ ప్లాంటు విషయంలో తనను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్
తన నేపథ్యం గురించి రఘురామ ప్రస్తావిస్తూ.. "నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను, నా జీవన విధానం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కొందరిలా పంది మాంసం అమ్ముకోలేదు, రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించలేదు" అంటూ ఘాటు విమర్శలు చేశారు. తాను పెట్టిన కేసులపై ప్రభుత్వం విచారణ జరిపి న్యాయం చేస్తుందని, తద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.