కిమ్స్ టెండర్ వివాదం... అసలు విషయం చెప్పిన మంత్రి సత్యకుమార్
- ఆదోని మెడికల్ కాలేజీ టెండర్పై ప్రభుత్వ వివరణ
- కిమ్స్ ఆసుపత్రి ఎలాంటి బిడ్ వేయలేదని స్పష్టీకరణ
- కిమ్స్ డాక్టర్ ప్రేమ్ చంద్ పేరుతో బిడ్ దాఖలు
- కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే పొరపాటు జరిగిందన్న మంత్రి
- మిగతా మూడు కాలేజీలకు అందని టెండర్లు
కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రేమ్ చంద్ షా తన వ్యక్తిగత హోదాలో టెండర్ దాఖలు చేశారని, అయితే ఆయన కిమ్స్లో పనిచేస్తుండటంతో సంస్థే బిడ్ వేసిందని పొరపాటు పడ్డామని మంత్రి వివరించారు. "ఇది కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. కిమ్స్ సంస్థ ఎలాంటి బిడ్ వేయలేదు" అని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు, ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలవగా, ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ నుంచి బిడ్ వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము టెండర్లలో పాల్గొనలేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తేల్చిచెప్పింది. కిమ్స్ ప్రకటనతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం పిలిచిన టెండర్లలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇప్పుడు ఆదోనికి వచ్చింది కూడా సంస్థాగత బిడ్ కాదని తేలింది.