బంగారాన్ని మించి పరుగులు.. ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో వెండి
- కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కుకు చేరువ
- అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 60 డాలర్లు క్రాస్
- ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పెరుగుతున్న డిమాండ్
- పారిశ్రామిక అవసరాలు పెరగడంతో వెండికి భారీ గిరాకీ
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర చరిత్రలో తొలిసారిగా ఔన్సుకు 60 డాలర్ల మార్కును దాటింది. బుధవారం ట్రేడింగ్లో ఔన్సు వెండి ధర 61.49 డాలర్ల వద్దకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే ఈ లోహాలపై పెట్టుబడులు పెరిగి, వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇదే ప్రస్తుత ధరల పెరుగుదలకు తక్షణ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం విపరీతంగా పెరగడం కూడా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు కేవలం ఆభరణాలు, గృహోపకరణాలకే పరిమితమైన వెండిని ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో సరఫరాలో అంతరం ఏర్పడి ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కాలంలో బంగారం ధర 59 శాతం పెరిగితే, వెండి ఏకంగా 107 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కును దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.32 లక్షలుగా ఉంది.