ఈ ప్రపంచంలో ఏదీ వృథా కాదు: సీఎం చంద్రబాబు
- ఆలోచనా విధానం మారితేనే స్వర్ణాంధ్ర సాధ్యమన్న సీఎం
- అక్టోబర్ 2 నాటికి మున్సిపాలిటీలలో చెత్త పూర్తి తొలగింపునకు హామీ
- గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి, తొలగింపును గాలికొదిలేసిందని విమర్శ
- పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటన
- సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసి చూపామని వెల్లడి
- సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని స్పష్టం
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం గుర్తుచేశారు. అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను విధించిందే తప్ప, దానిని తొలగించే బాధ్యతను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. "ప్రజారోగ్యాన్ని గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్త రహితంగా మారుస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడంతో పాటు, ఈ-వేస్ట్ను రీసైక్లింగ్ చేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
సంపద సృష్టించి, ప్రజల ఆదాయాన్ని పెంచడం తమ ప్రభుత్వానికి తెలుసని చంద్రబాబు అన్నారు. "అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే అవి ఎక్కువ కాలం నిలవవు. సూపర్ సిక్స్ అసాధ్యమన్న వారి విమర్శలను తిప్పికొట్టి, దానిని సూపర్ హిట్గా మార్చాం" అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు నగదు జమ చేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని వివరించారు. రాష్ట్రంలోని 40 వేల హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పీ-4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు.
"ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష" అని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.