గుడివాడ వన్ టౌన్ పీఎస్ కు వెళ్లిన కొడాలి నాని
- రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బెయిల్
- షరతుల్లో భాగంగా గుడివాడ పీఎస్ కు వెళ్లిన కొడాలి నాని
- పీఎస్ లో సంతకం చేసిన మాజీ మంత్రి
వివరాల్లోకి వెళితే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆయన గుడివాడ కోర్టును ఆశ్రయించారు.
అక్కడ అవసరమైన పత్రాలు సమర్పించగా, గుడివాడ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో భాగంగానే కొడాలి నాని ఈ రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేశారు. గతంలో ఆయన అరెస్ట్ అయ్యారంటూ వచ్చిన వదంతులను పోలీసులు అప్పుడే ఖండించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో ఆయన బెయిల్ షరతులను పాటిస్తున్నట్లు స్పష్టమైంది.