వంద కోట్ల రోడ్డు... నడిమధ్యలో చెట్లు... బీహార్లో అధికారుల నిర్వాకం!
- వింతగా రోడ్డు నిర్మాణం
- రూ.100 కోట్ల ప్రాజెక్టులో అధికారుల నిర్లక్ష్యం
- రోడ్డు మధ్యలోనే వదిలేసిన వృక్షాలు
- అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య వివాదం
- ప్రమాదాలతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
ఏం జరిగిందంటే?
పట్నా-గయా ప్రధాన రహదారిపై జెహానాబాద్ పరిధిలో 7.48 కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే, పనులు పూర్తయిన తర్వాత కూడా పాత చెట్లు రోడ్డు మధ్యలోనే నిటారుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లేమీ రాత్రికి రాత్రే మొలవలేదు. రోడ్డు విస్తరణ కోసం చెట్లను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం అటవీ శాఖ అనుమతి కోరింది. అయితే, ఇందుకు ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమిని తమకు కేటాయించాలని అటవీ శాఖ షరతు విధించింది. ఈ డిమాండ్ను జిల్లా యంత్రాంగం నెరవేర్చలేకపోయింది. దీంతో వారు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. చెట్లను తొలగించకుండా, వాటిని మధ్యలోనే వదిలేసి ఇరువైపులా రోడ్డు నిర్మించారు.
ప్రాణాలతో చెలగాటం!
ఈ చెట్లు ఒకే సరళరేఖలో కూడా లేకపోవడంతో వాహనదారులు వాటిని తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. డ్రైవింగ్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే చెట్లను తప్పించుకోవడానికి మెలికలు తిరుగుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చూడటానికి రూ.100 కోట్లతో మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న ఈ చెట్ల కారణంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని ఒకరు తెలిపారు. అయినప్పటికీ, ఈ చెట్లను తొలగించడానికి జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఒకవేళ ఈ మార్గంలో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. అధికారుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృథా అవడమే కాకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.