Health: రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా వాడితే... వేగంగా బరువు తగ్గొచ్చు!

- నెయ్యితో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని చెబుతున్న ఆయుర్వేదం
- అందులో కొవ్వు పదార్థాలు ఎక్కువే అయినా... బరువు తగ్గేందుకు తోడ్పడుతుందంటున్న నిపుణులు
- ప్రత్యేక తరహాలో వినియోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వెల్లడి
భారతీయుల ఆహారంలో నెయ్యిది ప్రత్యేక స్థానం. రకరకాల వంటకాలు, స్వీట్లలో నెయ్యిని వినియోగిస్తుంటాం. అయితే నెయ్యిలో కొవ్వుపదార్థాలు ఎక్కువ అని, దానితో బరువు పెరిగిపోతారనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. కానీ ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో ఉన్న ప్రయోజనాలు ఎన్నో. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కాస్త ఎక్కువే అన్నది కొంత వరకు వాస్తవమేనని... అయితే అది మన ఆరోగ్యానికి కూడా తోడ్పడుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయమే.. మసాలా టీ లేదా కాఫీతో కలిపి...
రోజూ ఉదయమే తీసుకునే మసాలా టీ, లేదా కాఫీలో ఒకట్రెండు చెంచాలు నెయ్యిని కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అందులో పాలు కలపవద్దని... బ్లాక్ మసాలా టీ, బ్లాక్ కాఫీతో మాత్రమే తీసుకోవాలని... ఇది శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గేందుకు తోడ్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
పొట్టలో కొవ్వు కరిగేందుకు...
- సాధారణ బ్లాక్ టీకి కొంత దాల్చిన చెక్క పొడిని కలిపి మసాలా టీ తయారు చేసుకోవాలని... అందులో ఒకట్రెండు చెంచాల నెయ్యిని కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అయితే చక్కెర అసలు వాడొద్దని, లేదా అత్యంత స్వల్పంగా వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
- నెయ్యిలోని విటమిన్లు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు శరీరానికి తక్షణ శక్తిని, ఇస్తాయని... అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, మసాలా టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కలసి శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని వివరిస్తున్నారు.
- నెయ్యిలో ఉండే బ్యూటరైట్ అనే ఫ్యాటీ యాసిడ్ మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని... అందువల్ల ఉదయమే బ్లాక్ టీతో కలిపి తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణమై, పోషకాలు శరీరానికి బాగా అందుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
- నెయ్యిలోని పదార్థాలు మన కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయని, దానితో ఆహారం తీసుకోవడం తగ్గిపోయి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
నెయ్యితో శరీరానికి ఆరోగ్యం సమకూరినా... అతిగా వాడటం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నెయ్యి నుంచి వచ్చే కేలరీలు చాలా ఎక్కువని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారు... వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు నెయ్యిని వాడవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా రోజుకు ఒకట్రెండు చెంచాలా నెయ్యి తీసుకుంటే... ఓవరాల్ గా శరీరానికి, ఆరోగ్యానికి మంచిదేనని వివరిస్తున్నారు.