పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు
- అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు
- గౌహతిలో ఫిర్యాదు చేసిన రిణికి భూయాన్ శర్మ
- ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్ ఖేరా
- ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా అభ్యర్థించగా, గౌహతి హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.
ఈ కేసు విచారణ కోసం పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. నిర్బంధ విచారణతో అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇది పరువు నష్టానికి సంబంధించిన అంశమని తెలిపారు. ఈ కేసులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాను చట్టాలకు అతీతమన్న రీతిలో స్పందించారని, ఆయన రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వల్లే పవన్ ఖేరా అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వవన్ ఖేరాపై నమోదైన కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద బెయిల్ పొందే అవకాశం ఉందని, మరికొన్ని సెక్షన్ల కింద అసలు అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని అన్నారు.
అసోం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి భార్య పాస్ పోర్టులకు సంబంధించిన నకిలీ, వక్రీకరించిన కాపీలను పవన్ ఖేరా చూపించారని ఆరోపించారు. ఆయన చూపించిన కాపీలన్నీ అవాస్తవమే అన్నారు. పరారీలో ఉండి వీడియోలు విడుదల చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.