మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత
- ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి
- క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన
- ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి
- భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ
ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన అధికారుల చొరవను అభినందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని సూచించామన్నారు.
బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అనిత స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.