మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం... ప్రజల కోసం ఎక్కడికైనా వస్తా: పవన్ కల్యాణ్
- గిరిజనుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న పవన్ కల్యాణ్
- సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పవన్ స్పష్టీకరణ
- 18 నెలల్లో ఏజెన్సీలో 460 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడి
- గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు మళ్లించిందని ఆరోపణ
- గ్రామస్థులు చెప్పిన పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిన ఉప ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమే మీ గడప వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా పాలనను ప్రక్షాళన చేశాం. మీరు కష్టాలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాకముందే వాటిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వం నిధులు మళ్లించడం వల్లే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. "జలజీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఏజెన్సీ గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాం. గిరి శిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న డోలీ కష్టాలు ఇక కనిపించకూడదన్నదే మా లక్ష్యం" అని వివరించారు. కేవలం 40 గడపలున్న నందిగరువు గ్రామానికి రూ.2 కోట్లతో రోడ్డు నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షలాది మంది మధ్య కాకుండా, 70 ఏళ్లుగా రోడ్డుకు నోచుకోని మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. "ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా మేము ఎక్కడా వివక్ష చూపించం. మీరు ఓట్లు వేశారా లేదా అని చూడకుండా, మీరు బాగుండాలనే పనిచేస్తాం. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారేమో కానీ, ప్రజల కోసం పనిచేసే నాకు ఎలాంటి భయాలు లేవు" అని స్పష్టం చేశారు.
‘మాట-మంతి’లో భాగంగా గ్రామస్థులు ప్రస్తావించిన పలు సమస్యలకు పవన్ కల్యాణ్ అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. ఓనూరు పాఠశాల మరమ్మతులు, కొత్తపొలం గ్రామానికి 1.6 కి.మీ. రోడ్డు మంజూరు, అసంపూర్తిగా ఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాల పూర్తికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.