వాటికి అడ్డు చెప్పవద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది: బండి సంజయ్
- కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదేపదే మోసం చేశారని ఆరోపణ
- పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని ఏపీకి తరలించారన్న బండి సంజయ్
- అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శ
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదేపదే మోసం చేశారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించినప్పుడు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాను పూర్తిగా వాడుకోలేదని, అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పవద్దని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, అయితే ఆ చట్టంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కు 4 టీఎంసీల నీటిని తరలించారని, దీనిని తెలంగాణ కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ గతంలో పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతోందని ఆయన అన్నారు.