Prithviraj: విజయశాంతికి పాదాభివందనం చేసిన నటుడు పృథ్వీ

- పలు సినిమాల్లో విజయశాంతికి సోదరుడుగా నటించిన సీనియర్ నటుడు పృథ్వీ
- 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ప్రచార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
నటి విజయశాంతికి సీనియర్ నటుడు పృథ్వీ పాదాభివందనం చేశారు. ఆ సమయంలో విజయశాంతి "మీరు నా చిన్న తమ్ముడు" అని అనగా, "నేను అక్కకు ప్రియమైన తమ్ముడిని" అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు. వేదికపై జరిగిన ఈ ఆసక్తికర సంభాషణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమాల్లో నటించారా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
1997లో వచ్చిన 'పెళ్లి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీ దాదాపు 200లకు పైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. 1999లో శరత్ కుమార్, విజయశాంతి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం 'రాజస్థాన్'లో పృథ్వీ నటించారు. ఆ తర్వాత వైజయంతి చిత్రంలోనూ విజయశాంతికి సోదరుడిగా చేశారు.
కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనూ పృథ్వీ నటించారు. ఈ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి చిత్ర బృందాన్ని పరిచయం చేస్తున్న క్రమంలో బబ్లూ పృథ్వీరాజ్ను వేదికపైకి ఆహ్వానించగా, ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతితో ఉన్న సోదర అనుబంధాన్ని, ఆమెతో నటించిన చిత్రాలను పృథ్వీ వెల్లడించారు.