Mohan Babu: మంచు మనోజ్పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్తో మోహన్ బాబు ఏమన్నారంటే?

- కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపై ఎవరికీ హక్కు లేదన్న మోహన్ బాబు
- మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలని స్పష్టీకరణ
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరైన మోహన్ బాబు, మనోజ్
తాను కష్టపడి సంపాదించిన ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని, మనోజ్ తన ఆస్తులను తనకు అప్పగించాల్సిందేనని నటుడు మోహన్ బాబు స్పష్టం చేశారు. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరైన విషయం విదితమే. బాలాపూర్ మండలంలోని జల్పల్లి గ్రామంలో తాను ఉంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించాడని, ఆస్తులు కావాలని డిమాండ్ చేస్తున్నాడని మోహన్ బాబు ఇదివరకే ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు విచారణ క్రమంలో, ఈరోజు మోహన్ బాబు, మంచు మనోజ్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఆస్తి తగాదాలకు సంబంధించిన వివరాలను అందించారు. దాదాపు రెండు గంటల పాటు జిల్లా మేజిస్ట్రేట్ ఇద్దరినీ విచారించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, తన ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని, ఆస్తులను మనోజ్ అప్పగించాలన్నారు. అనంతరం, వచ్చేవారం మరోసారి విచారణకు హాజరుకావాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.