Durga Idol: హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Durga idol vandalised in Nampally grounds

  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహం ఏర్పాటు
  • గత అర్ధరాత్రి అమ్మవారి చేతిని విరగ్గొట్టిన దుండగులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు, భక్తులు

హైదరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గత అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైన విషయాన్ని స్థానికులు ఈ ఉదయం గుర్తించారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. 

ఈ విషయం క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నేతలు, భక్తులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు హుటాహుటిన వెళ్లారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోకి ప్రవేశించిన దుండగులు తొలుత అక్కడ విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను పగులగొట్టారు. అనంతరం అమ్మవారి చేతిని విరగ్గొట్టి, అక్కడున్న పూజ సామగ్రిని చెల్లాచెదురుగా విసిరేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బ్యారికేడ్లను సైతం తొలగించారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News