నల్గొండ సభలో కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
- కోమటిరెడ్డి రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు? అని ప్రశ్న
- ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా... నల్గొండకు కనీసం మంచినీళ్ళివ్వలేదన్న కేసీఆర్
- కాంగ్రెస్ వస్తే భూమాత.. కాస్త భూమేత అవుతుందని సెటైర్లు
కాంగ్రెస్ పాలించిన యాభై ఏళ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని, ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది మంత్రులుగా పని చేశారని, కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదని విమర్శించారు. గత పదేళ్లలోనే నల్గొండ పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి చెందిన విషయం గుర్తించాలన్నారు. నల్గొండ అభివృద్ధి మీ కళ్లముందే ఉందని, ఐటీ టవర్ కూడా వచ్చిందని, ఇక్కడ ఇప్పుడు వెయ్యి, పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రూ.200 ఉన్న పెన్షన్ను క్రమంగా రూ.2000కు పెంచుకున్నామని గుర్తు చేశారు.
యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ రాలేదన్నారు. కానీ ఇప్పుడు మూడు కాలేజీలు ఉన్నాయన్నారు. వందలాది బెడ్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చిందన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తయిందని, లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్కు బదులు కాంగ్రెస్ పార్టీ భూమాత పోర్టల్ తెస్తామంటున్నారని, అప్పుడు అది భూమాత అవుతుందో.. భూమేత అవుతుందో అని ఎద్దేవా చేశారు.