పాత నంబర్ తో మంత్రి నిరంజన్ చైనాకు ఫోన్ చేసేవారు.. ఈడీకి ఫిర్యాదు చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
- చైనాలో ఉన్న ఓ వ్యక్తితో మంత్రి తరచూ మాట్లాడేవారన్న రఘునందన్
- ఆ వ్యక్తి అమెరికాలో ఆర్థిక లావాదేవీలు చేశారని విమర్శ
- దత్త పుత్రుడి పేరుపై ఎన్నో కాంట్రాక్టులు దక్కించుకున్నారని ఆరోపణ
కృష్ణానది ఒడ్డున మంత్రి 80 ఎకరాలు కబ్జా చేశారని ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు. దీన్ని ఖండించిన మంత్రి నిరంజన్.. తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. దీనిపై ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రఘునందన్ రావు మంత్రికి దీటుగా కౌంటర్ ఇచ్చారు. సర్వే నెం. 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై సమాధానం ఇవ్వలేదని అన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో ఓ గిరిజన బిడ్డను తన దత్తపుత్రుడిగా చెప్పుకున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆ దత్తపుత్రుడి పేరుపై కాంట్రాక్ట్ వర్కులు చేయించుకున్నారని ఆరోపించారు. గిరిజన బిడ్డను అడ్డు పెట్టుకొని పొందిన సబ్సిడీలు ఎన్ని? అని ప్రశ్నించారు. ప్రజలను మంత్రి నిరంజన్ రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు మంత్రి కొనుగోలు చూసిన భూముల లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు.