బ్యాంకును దోచేద్దామని.. సొరంగం తవ్వుతుంటే ప్రమాదం
- ఇటలీలోని రోమ్ లో వెలుగు చూసిన ఘటన
- బయటపడిన నలుగురు దొంగలు
- ఆరు మీటర్ల లోతులో చిక్కుకుపోయిన మరో దొంగ
- కాపాడిన విపత్తు సహాయక సిబ్బంది
సొరంగం తవ్వుతుంటే అది కూలిపోయింది. దీంతో ఆరు మీటర్ల లోతు సొరంగంలో ఓ దొంగ ఎనిమిది గంటల పాటు చిక్కుకుపోయాడు. అగ్నిమాపక, విపత్తు సహాయక సిబ్బంది ఎనిమిది గంటల పాటు కష్టపడి అతడ్ని ప్రాణాలతో కాపాడారు. ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు కలసి బ్యాంకు దోపిడీకి ప్రణాళిక వేసుకున్నట్టు స్థానిక మీడియా కథనం.
ఆగస్ట్ 15న ఫెర్రగాస్టో సందర్భంగా పబ్లిక్ హాలిడే కావడంతో ఆ రోజున బ్యాంకులోకి వెళ్లి దోచేయాలన్నది వారి పన్నాగం. ఇందుకోసం ఖాళీగా ఉన్న ఓ షాపు నుంచి భూమిలో సొరంగం తవ్వకం చేపట్టారు. అది మధ్యలో కూలిపోవడంతో నలుగురు బయటపడగా, మరొకరు చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడుకునేందుకు బయటపడిన వారే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.