నేడు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రెండు రైళ్ల ప్రయాణం.. 'ఆటోమేటిక్ బ్రేక్స్' వ్యవస్థపై రైల్వే మంత్రి ప్రత్యక్ష పరిశీలన!
- ఇవాళ ‘కవచ్’ను పరీక్షించనున్న రైల్వే
- 200 మీటర్ల దూరంలో ఆగిపోయేలా ఏర్పాట్లు
- లింగంపల్లి–వికారాబాద్ సెక్షన్ లో టెస్ట్
ఎదురెదురుగా రైళ్లు వచ్చినా ఢీకొట్టుకోకుండా తయారు చేసిన స్వదేశీ వ్యవస్థ ‘కవచ్’ను ఇవాళ టెస్ట్ చేయనున్నారు. అందులో భాగంగానే రెండు రైళ్లను ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా నడపనున్నారు. ఒక రైలులో రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్, ఇంకో రైలులో బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠి ప్రయాణించి ఆ వ్యవస్థ పనితీరును తెలుసుకోనున్నారు.
పరీక్షలో భాగంగా లోకోపైలట్ లు రైళ్లను ఆపరు. కవచ్ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్ గా బ్రేకులు పడి 200 మీటర్ల దూరంలో ఆ రెండు రైళ్లు ఆగిపోతాయి. పట్టాలు బాగాలేకపోయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా, ఎదురెదురుగా రైళ్లు వచ్చినా వెంటనే కవచ్ గుర్తించి ఆపేస్తుంది. వంతెనలు, మలుపుల వద్ద పరిమితికి మించిన వేగంతో వెళ్లినా వెంటనే అలర్ట్ చేసి వేగాన్ని తగ్గిస్తుంది.