CS Sameer Sharma: ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ఉద్యోగులకు మరోసారి తెలియజేస్తున్నాం: ఏపీ సీఎస్ సమీర్ శర్మ

CS Sameer Sharma on employees issues

  • మంత్రుల కమిటీతో ఉద్యోగుల చర్చలు విఫలం!
  • ఐఆర్ తో పనిలేకుండా జీతం పెరుగుతుందన్న సీఎస్
  • సమ్మె ఆలోచన విడనాడాలని హితవు
  • అందరం ఒకే కుటుంబం అని ఉద్ఘాటన

సమ్మె చేయాలన్న ఉద్దేశానికే ఉద్యోగులు కట్టుబడి ఉండడం పట్ల ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పందించారు. ఏ ఒక్కరికీ జీతాలు తగ్గబోవని, ఆ విషయం ఇవాళ రాత్రి జీతాలు వచ్చిన తర్వాత అర్థమవుతుందని అన్నారు. ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని 'ఛలో విజయవాడ', సమ్మె ఆలోచన విడనాడాలని హితవు పలికారు.

ఉద్యోగులకు శక్తిమేర చేయడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని సమీర్ శర్మ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, మనందరం ఒకే కుటుంబం అని పేర్కొన్నారు. ఈ రాత్రి 11 గంటల్లోగా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పడతాయని సీఎస్ వెల్లడించారు. పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు.

అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. సమ్మెకు వెళ్లడం అంటే నష్టదాయకమేనని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధమని మరోసారి తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.

CS Sameer Sharma
Employees
CM Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News