Bandla Ganesh: పూరీ జగన్నాథ్ ను విచారిస్తుండగా ఈడీ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేశ్

Bandla Ganesh spotted at ED Office in Hyderabad

  • టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
  • నోటీసులు పంపిన ఈడీ అధికారులు
  • నేడు పూరీ జగన్నాథ్ ను విచారణకు పిలిచిన వైనం
  • తనకు సంబంధం లేదన్న బండ్ల గణేశ్

డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఉదయం నుంచి పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూరీ ఓ దశలో బండ్ల గణేశ్ పేరు ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ ను అధికారులు అప్పటికప్పుడు పిలిపించినట్టు తెలుస్తోంది.

మొత్తానికి బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు కనిపించారు. దాంతో ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తాను పూరీ జగన్నాథ్ ను కలిసేందుకు వచ్చానని, డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాను కనీసం వక్కపొడి కూడా వేసుకోనని స్పష్టం చేశారు.

గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో', 'టెంపర్' వంటి హిట్ సినిమాలను నిర్మించింది బండ్ల గణేశే. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అనేకమంది ప్రముఖులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. వారందరినీ వరుసగా విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేడు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారణకు పిలిచారు.

Bandla Ganesh
Puri Jagannadh
Drugs Case
ED
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News