Harshavardhan: కరోనా వ్యాక్సిన్ కారణంగా వంధ్యత్వం రాదు: కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టీకరణ

  • ఈ నెల 16 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
  • అపోహలను తొలగించే ప్రయత్నం చేసిన కేంద్రమంత్రి
  • వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయని వెల్లడి
  • వాటికవే పోతాయని వివరణ
Union minister Harsha Vardhan clarifies about corona vaccine

ఈ నెల 16 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రయత్నించారు. కరోనా వ్యాక్సిన్ తో దుష్పరిణామాలు కలుగుతాయన్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కరోనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు స్వల్ప జ్వరం, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి, ఒళ్లు నొప్పులు కలుగుతాయని వెల్లడించారు. ఈ లక్షణాలు తాత్కాలికమేనని, వాటికవే తగ్గిపోతాయని వివరించారు.

ముఖ్యంగా, కొవిడ్-19 వ్యాక్సిన్ తో పురుషులు, మహిళల్లో వంధ్యత్వం ఏర్పడుతుందన్న సందేహానికి బదులిస్తూ, దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని స్పష్టం చేశారు. కరోనా వల్ల కూడా వంధ్యత్వం వస్తుందని ఇంతవరకు ఎక్కడా నిరూపితం కాలేదని వివరించారు. కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వం చెప్పే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.  

More Telugu News