Prudhvi Raj: చిరంజీవి, పవన్ నాకు అవకాశాలు ఇచ్చారు.. నాగబాబు మాత్రం మాట్లాడటం లేదు: పృథ్వీ

  • రాజకీయాల్లో భాగంగానే వారిని విమర్శించాను
  • వ్యక్తిగతంగా వారిని విమర్శించేంత స్థాయి నాకు లేదు
  • పవన్ సినిమాలు చేస్తుంటేనే బాగుంటుంది
Comedian Prithvi responds on Chiranjeevi and Pawan Kalyan

గత ఎన్నికలకు ముందు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులపై టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మెగా అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. తాజాగా, ఆయన పూర్తిగా రూటు మార్చారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై ప్రశంసల జల్లు కురిపించారు. కేవలం రాజకీయాల్లో భాగంగానే తాను చిరంజీవి, పవన్ లను విమర్శించానని చెప్పారు. అంతకు మించి తకు వేరే దురుద్దేశం లేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల తర్వాత ఆయన టీటీడీ అనుబంధ సంస్థలో ఓ కీలక పదవిని సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఒక వివాదం కారణంగా ఆయన ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆయన వైసీపీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటు సినిమాలు కూడా ఆయనకు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో, పృథ్వీకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. పవన్ సైతం తన సినిమాలో పృథ్వీని తీసుకున్నారు. దీంతో, ఆయనకు మళ్లీ ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో పృథ్వీ మాట్లాడుతూ, చిరంజీవి, పవన్ తనకు మళ్లీ ఆఫర్లు ఇచ్చారని చెప్పారు. నాగబాబు మాత్రం తనతో మాట్లాడటం లేదని తెలిపారు. రాజకీయాల వల్లే పవన్ పై విమర్శలు చేయాల్సి వచ్చిందని అన్నారు. అంతేకానీ, వ్యక్తిగతంగా వారిని తిడితే అభిమానులు మా ఇంటికి వచ్చి కొడతారని చెప్పారు. వారిని విమర్శించేంత స్థాయి తనకు లేదని అన్నారు. తన ఉద్దేశంలో పవన్ కల్యాణ్ సినిమాలు కూడా చేస్తుంటేనే మంచిదని చెప్పారు. మరోవైపు, పృథ్వీలో వచ్చిన మార్పును చూసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో... సినిమా అవకాశాల కోసమే ఆయన మారిపోయారని విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదు.

More Telugu News